- తప్పించుకున్న మావోయిస్టు అగ్రనేతలు
- కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సోదాలు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలో తృటిలో భారీ ఎన్కౌంటర్ తప్పింది. ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 30 నుండి 40 మంది సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. రెండు రా ష్ట్రాల స్పెషల్ పార్టీ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా, పోలీసుల రాకను గమనించిన మావోలు చాకచక్యంగా తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు.
పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, మైలారపు అడేలు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ ఉన్నట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఘటనా స్థలం నుంచి కిట్ బ్యాగులు, ఆలివ్ గ్రీన్ డ్రెస్లు, సుతిల్ బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత్రలు, కి రాణా వస్తువులు, దోమ తెరలు, మావోయిస్టు విప్లవ సాహిత్యం, మందులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇంకా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. రాబోవు ఎన్నికలే లక్ష్యంగా కుట్రకు శ్రీకారం చుట్టే క్రమంలో తిప్పికొట్టినట్లు ఎస్పీ తెలిపారు. ములుగు జిల్లాలో మావోయిస్టులను అడుగు పెట్టనివ్వమని ఆయన హెచ్చరించారు. తెలంగాణాలో మావోయిస్టులు ఏదో అలజడి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ సమాచారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టగా మావోయిస్టులు పసిగట్టి కాల్పులు జరపగా పారిపోయారని ఎస్పీ పేర్కొన్నారు. ఏజన్సీ ప్రాంత ప్రజలు మా వోయిస్టులకు సహకరించొద్దని, వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు తెలపాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు.