- రాజీనామాకు సిద్ధమైన ఓ కార్పొరేటర్
- వరంగల్ వ్యాపారవర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత
- ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితోనే..?
- బుజ్జగించేందుకు పలువురు నాయకుల యత్నం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వరంగల్ తూర్పు గులాబీ పార్టీలో మళ్లీ అసంతృప్తి రగులుకుంటోంది. ఏకంగా ఓ కార్పొరేటర్ పార్టీతోపాటు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీరుతో తీవ్ర అసంతృప్తికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం తూర్పు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాజీనామా లేఖను కూడా అందరికీ పంపిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సదరు కార్పొరేటర్ తన రాజీనామా లేఖను స్వయంగా ఎమ్మెల్యేకు ఇచ్చేందుకు వెళ్లగా, మాట్లాడుదాం.. అంటూ చెప్పినట్లు సమాచారం. అయితే.. కార్పొరేటర్ను బుజ్జగించేందుకు మరో నలుగురు కార్పొరేటర్లు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్ వ్యాపారవర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత కావడంతో పరిణామాలు ఎలా ఉంటాయోనని రాజీకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
కొంతకాలంగా అసంతృప్తితో…
నిజానికి.. వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న తరుణంలో మళ్లీ అనూహ్యంగా ఓ కార్పొరేటర్ రాజీనామాకు సిద్ధపడడం పార్టీలో కలకలం రేపుతోంది. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలేం జరిగిందనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి.. సదరు కార్పొరేటర్ కొంతకాలంగా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్నికొన్ని విషయాలు కార్పొరేటర్కు సంబంధం లేకుండానే, ఆయనకు తెలియకుండానే.. ఎమ్మెల్యేనే నేరుగా జోక్యం చేసుకుంటుండడంపై కార్పొరేటర్ అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం సందర్భంగా జరిగిన ఓ ఘటనలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడమే కార్పొరేటర్ అసంతృప్తికి కారణమన్నట్లు సమాచారం. గతంలోనూ పలు విషయాల్లో ఎమ్మెల్యే తీరుపై కొంత అసహనంతో ఉన్నట్లు పార్టీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అసలేం జరిగింది…?
డివిజన్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి కొందరు ఆర్పీలు సకాలానికి హాజరుకాకపోవడంతో ఏఎన్ఎం సంబంధిత సీవోతోపాటు కార్పొరేటర్కు సమాచారం ఇవ్వగా, ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, వారికి ఇబ్బంది కలగకుండా సమయపాలన పాటించాలంటూ కార్పొరేటర్ చెప్పినట్లు తెలిసింది. అయితే.. దీనిని సీరియస్గా తీసుకున్నసదరు ఆర్పీలు ఈ విషయంపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంటనే ఎమ్మెల్యే కార్పొరేటర్తో సంబంధం లేకుండా నేరుగా ఆ ఏఎన్ఎంను పిలిపించి మాట్లాడడంతో ఆమె మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సదరు కార్పొరేటర్ తీవ్ర అసంతృప్తికి లోనై తన పదవితోపాటు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవడం, ఏకంగా లేఖ ఎమ్మెల్యేకు అందించేందుకు ప్రయత్నం చేయడం.. పార్టీవర్గాల్లో కలకలం రేపుతోంది.
Must Read