సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు
మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు
అక్షరశక్తి, ములుగు : మేడారం జాతరలో అధికారుల పనితీరు భేష్ అని జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహించ గలిగామని దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు అన్నారు. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర విజయవంతం చేసిన అధికారులను మంత్రులు శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు, ఉన్నతాధికారులు దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో వనదేవతల జాతర సజావుగా జరిగినట్టు తెలిపారు.
అధికారులు ముందు నుండి సూక్ష్మస్థాయిలో ప్రణాళికతో ముందుకు సాగడంతో జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగలేదని చెప్పారు. అమ్మవార్ల దయతో భక్తులు మొక్కులు చెల్లించుకుని సంతోషంగా తిరిగి వెళ్లారని వెల్లడించారు. అందరి సహకారంతో జాతర విజయవంతం చేయగలిగామని, జాతర ఏర్పాట్లు, నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ గిరిజన జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని, ఈ జాతరకు రూ.75 కోట్లు మంజూరు చేశారన్నారు.
నాలుగు జాతరలకు కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం రూ. 332.71 వెచ్చించిందని తెలిపారు. ఈ నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టామని, మౌలిక వసతుల కొరత తీరిందన్నారు. సకాలంలో నిధులు విడుదల చేయడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. జాతరలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఎమ్మెల్యే సీతక్క, ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిదులతో పాటు తమంత సమన్వయంతో పని చేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో దేవాదాయ శాఖ తరపున రూ. 10 కోట్లతో సూట్ రూమ్స్, డార్మిటిరీ, క్యాంటీన్ , ఇతర సౌకర్యాలతో వసతి గృహల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.