- మూడేండ్ల విరామం తర్వాత ఐదు శాతం డీఏ పెంపు
- నేడో రేపో అధికారిక ప్రకటన?
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెరగనుంది. ఈమేరకు సంస్థ యాజమాన్యం నుంచి అతి త్వరలో గుడ్ల న్యూస్ అందనుంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు 5 శాతం కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది.
ఇటీవల బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్న ఆర్టీసీ యాజమా న్యం.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నది. ఆర్టీసీ చార్జీలను రౌండ్ ఫిగర్ చేయడం, డీజిల్ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఆరు డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని సోమవారం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫాం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది.