- మూడోసారి ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొట్టాలి
- రైతుల పక్షాన నిలబడే నాయకుడు కేసీఆర్
- రేపు ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి
- ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలి
- మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరూరి
అక్షరశక్తి, కాజీపేట : వర్ధన్నపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని, మూడోసారి తనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం కాజీపేట మండలం బట్టుపల్లిలో అక్టోబర్ 27వ తేదీన నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడారు. లక్ష మందితో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధితోపాటు, అనేక సంక్షేమ పథకాలను ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది, సీఎం కేసీఆర్దని అన్నారు. అభివృద్ధి ప్రదాత ఈ కార్యక్రమానికి రానున్నారని అత్యధిక సంఖ్యలో ప్రజలు, లబ్ధిదారులు పాల్గొననున్నారని తెలిపారు. సభా స్థలంలో రెండు దిక్కులా పార్కింగ్ ప్రదేశాలను,హేలి ప్యాడ్ ను ఏర్పాటు చేశామని, సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు.
ఎక్కడ అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పదేళ్లలో ఎంతగానో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, భారీ మెజారిటీ ఇచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడినే ప్రజలు నమ్ముతారని అన్నారు. కరోనా కష్టకాలంలో, వరదల సమయంలో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నటువంటి తనను మరోమారు ప్రజలు ఆశీర్వదిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగుర్ల వెంకన్న, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.