- వర్ధన్నపేట బీజేపీ టికెట్ కోసం అనిల్కుమార్ ప్రయత్నాలు
- నియోజకవర్గంలో సైలెంట్గా గ్రౌండ్వర్క్
- ఇప్పటికే అన్ని మండలాల్లోనూ పర్యటన
- పేరును పరిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయాలన్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. పార్టీ కోసం కష్టపడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండే బలమైన అభ్యర్థి కోసం ఆరా తీస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ పార్టీ అధ్యక్షుడు, పలివేల్పుల మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్కుమార్ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నేతల నుంచి కొంతమేరకు సానుకూల సంకేతాలు అందడంతో దేవరకొండ అనిల్కుమార్ నియోజకవర్గంలో కొంతకాలంగా సైలెంట్గా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతోపాటు ప్రజలను కలుస్తూ.. పార్టీ బలాబలాలపై ప్రతీ గ్రామం నుంచి సమాచారం సేకరిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
- సర్పంచ్గా ప్రస్థానం మొదలు..
ఉన్నత విద్యావంతుడైన దేవరకొండ అనిల్కుమార్ పలివేల్పుల గ్రామ సర్పంచ్గానూ పనిచేశారు. ఆ తర్వాత ఆ గ్రామం గ్రేటర్ వరంగల్లో విలీనమైంది. ప్రస్తుతం ఆయన బీజేపీ ఒకటో డివిజన్ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా.. ఆయన చెల్లెలు అరుణకుమారి ఇదే డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 13 డివిజన్లతోపాటు వర్ధన్నపేటతోపాటు ఇతర మండలాల్లోనూ దేవరకొండ అనిల్కుమార్కు పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నాయకుడిగా గుర్తింపు ఉంది. అంతేగాకుండా, కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన అనిల్కుమార్ను బరిలోకి దించితే.. అనేక సమీకరణాలు కలిసి వస్తాయన్న యోచనలో ఉన్న పార్టీ పెద్దలు.. ఆయన పేరును పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు అనిల్కుమార్ విస్తృతంగా పర్యటిస్తూ అన్నివర్గాల ప్రజలను కలుస్తున్నారు. - నియోజకవర్గంలో బలంగా..
గతంలో కన్నా.. వర్ధన్నపేట నియోజకవర్గంలో బీజేపీ బలపడుతోంది. ఈ నియోజకవర్గం పరిధిలోకి గ్రేటర్ వరంగల్కు సంబంధించి 13 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్ల పరిధిలో సుమారు ఒక లక్షా నలభైవేల ఓట్లు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. ఒకటో డివిజన్, 2వ డివిజన్, 44వ డివిజన్, 66వ డివిజన్లలో పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగతా డివిజన్లలో కొద్దిపాటితేడాతో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఈ డివిజన్ల నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు సుమారు 30వేల ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థులకు సుమారు 40వేల ఓట్లు, ఇక కాంగ్రెస్కు 12వేల ఓట్లు వచ్చాయి. ఇక నియోజకవర్గ కేంద్రమైన వర్ధన్నపేటలోనూ బీజేపీ కొంత బలంగానే ఉంది. పర్వతగిరి, ఐనవోలు మండలాల్లోనూ పార్టీ బలోపేతంపై నేతలు ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. బలమైన అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.