అక్షరశక్తి డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధీప్ సింగ్ పూరీ ని కలిసి, 500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు. ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని, కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్ పాటీల్ ను కోరారు. ఉప ముఖ్యమంత్రి బట్టీ విక్రమార్కా, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డీ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు.
కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిన బృహత్తర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా వివరించారు. రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4 వేల కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించాలని కోరారు. జంట నగరాలకు సంబంధించి ఈ రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని వివరించారు. జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019 లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు ఇవ్వలేదని గుర్తుచేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ మరియు రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు