- ఘనంగా బాబాసాహెబ్ జయంతి వేడుకలు
- రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరించుకున్న ప్రముఖులు
అక్షరశక్తి, వరంగల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతోపాటు విద్యార్థి, యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. దేశం తలరాతను మార్చిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
అంబేద్కర్ అందరివాడు : ఎర్రబెల్లి
హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాల వేసి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ అపర మేధావి అని, అంటరాని తనాన్ని రూపుమాపిన సంఘ సంస్కర్త అన్నారు.
దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. అంబేద్కర్ కేవలం దళితుడు కాదని, ఆయన అందరివాడని అన్నారు.
హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్, హన్మకొండ ఇంచార్జీ కలెక్టర్ గోపి, కుడా వైస్ చైర్ పర్సన్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.