- సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
- ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్రం మరోసారి
మొండి చెయ్యి చూపిందంటూ నాయకుల ఆగ్రహం - అక్షరశక్తి, వరంగల్ : కేంద్రంపై కామ్రేడ్లు కన్నెర చేశారు. బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండి చెయ్యి చూపిందంటూ సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు హన్మకొండ, వరంగల్ నగరాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ గురువారం హనుమకొండ కాళోజీ విగ్రహం ఎదుట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు మరోసారి అడియాశలు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం పట్ల, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్శిటీలను కేంద్రం విస్మరించిందని అన్నారు. మరోవైపు మోడీ ప్రభుత్వం తన పక్షపాత బుద్దిని బయట పెట్టుకుంటూనే ఉన్నదని, అన్నిరాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకపై కరుణ చూపారని, ప్రాజెక్టుల కోసం రూ.5,300 కోట్ల సాయం ప్రకటించారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు, త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల పట్ల తమ ప్రేమను కనబరిచారని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా చివరి బడ్జెట్ లోనూ ఉద్యోగ కల్పన మాట మరిచారని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్లో అంకెల గారడీతో మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులు మునిగాల బిక్షపతి, మారపాక అనిల్, కొట్టెపాక రవి, కండే నరసయ్య, భాషబోయిన సంతోష్, మాలోతు శంకర్, వేల్పుల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హమీలను విస్మరించిన కేంద్రం : మేకల రవి
సీపీఐ ఖిలా వరంగల్ మండల సమితి ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి వద్ద సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విభజన హామీలను అమలుపరచలేదని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్శిటీలను కేంద్రం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు దండు లక్ష్మణ్, గన్నారపు రమేష్, సంగి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు తీవ్ర అన్యాయం : వలీ ఉల్లా ఖాద్రీ
అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో వరంగల్ కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్లో యూనియన్ బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అ ధ్యక్షుడు డాక్టర్ లీ ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలు మరోసారి అడియాశలు అయ్యాయన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ బడ్జెట్ నిరంకుశ విధానాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ వరంగల్ జిల్లా నాయకులు మస్కా సుధీర్, రమేష్, శివుడు, రమేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేటలో నిరసన
కేంద్ర బడ్జెట్లో కాజీపేట రైల్వే పరిశ్రమకు నిధులు కేటాయించలేదని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాజీపేట్ రైల్వే స్టేషన్ ముందు సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్ర మంలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు మారుపాక అనిల్ కుమార్, మాలోతు శంకర్, మునిగాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో..
కేంద్ర బడ్జెట్లో 10 శాతం నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని విస్మరించడాన్ని నిరసిస్తూ
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ నయీంనగర్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల ప్రసన్నకుమార్, భాషబోయిన సంతోష్,జిల్లా ఉపాధ్యక్షులు తంగళ్ళపల్లి రఘు, వేల్పుల చరణ్ యాదవ్, కేథీరి ఉపేందర్, జిల్లా సహాయ కార్యదర్శి కసర బోయిన రవితేజ, నాయకులు విగ్నేష్ ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు.