రెండ్రోజులు పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మెడికల్, టెక్నాలజీ రంగాల్లో భారత్ తో పనిచేయడం గురించి ప్రకటన చేయనున్నారు. తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.
కాగా.. బోరిస్ జాన్సన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో ఆయన భారత్ రావాలనుకున్నా కరోనా కారణంగా రెండుసార్లు పర్యటన వాయిదా పడింది. బ్రిటన్ లో ఉన్న భారతీయుల్లో అత్యధికంగా గుజరాత్ వాసులే ఉండటంతో ఆయన నేరుగా అహ్మదాబాద్ కు వచ్చారు.