Monday, September 16, 2024

రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి- వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సు 65 కు పెంచాలి

Must Read

-వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి

– ఆకుట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రో. శ్రీనివాస్, డా ఇస్తారి

-రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుంది

అక్ష‌ర‌శ‌క్తి డిస్క్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుందని ఇంకా కొన్ని రోజులయితే విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేని కళాశాలలు లాగా తయారయ్యే పరిస్తితి అవుతుందని వెంటనే యూనివర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సును 60 నుండి 65 కు పెంచి నూతన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేసేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్శిటీ టీచర్స్ బాధ్యులు హైద్రాబాద్ లో వేం నరేందర్ రెడ్డిని, ప్రో.కొండండ రాం మరియు పొన్నం ప్రభాకర్లకు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆకుట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రో. టీ. శ్రీనివాస్, డా మామీడాల ఇస్తారి, ఉపాధ్యక్షులు ప్రో. బ్రహ్మేశ్వరీ లు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం 30.03.2021 నాటి జీవో నెంబర్ 45 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచిందని ఈ జీవో కు కొనసాగింపుగా, గత రాష్ట్ర-ప్రభుత్వ ఆర్థిక శాఖ తేదీ 04.04.2021, ప్రభుత్వ ఉద్యోగులందరి పదవీ విరమణ వయస్సు పెంపుదల గురించి తెలియజేస్తూ సర్క్యులర్ జారీ చేసిందనీ అన్నారు. గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు లేదా సొసైటీలు, విశ్వవిద్యాలయాలు- (నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం), యూజీసీ స్కేల్‌లను తీసుకుంటున్న టీచర్లతో సహా, కార్పొరేషన్లు, సంస్థలు మరియు ఇతర సంస్థల ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయస్సు పెంచి కేవలం విశ్వవిద్యాలయాల టీచర్లకు పెంచలేదని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా, సీనియర్ ప్రొఫెసర్లు లేనప్పుడు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు న్యాక్ మరియు ఎన్.బీ.ఏ అక్రిడిటేషన్‌లో తాము కోరుకున్న ర్యాంకింగ్‌లను పొందలేరని అన్నారు. వర్సిటీలో తగినంత టీచర్ల సంఖ్య లేకుంటే యూజీసీ, ఐ.సీ.ఎస్.ఎస్.ఆర్ మరియు సీ.ఎస్. ఐ.ఆర్ ల నుండి పరిశోధన- మరియు అభివృద్ధి గ్రాంట్లు రావడం కష్టతరం అవుతుందని అన్నారు. పదవీ విరమణల కారణంగా రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాలలో ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా లేకుండా చాలా విభాగాలు ఉన్నాయని వెంటనే రిక్రూట్మెంట్ చేస్తే విశ్వవిద్యాలయాలు బాగు పడతాయని అన్నారు. ఈ విషయంలో, పశ్చిమ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పాండిచ్చేరి, ఢిల్లీ మరియు అస్సాం రాష్ట్రాలు పదవీ విరమణ వయస్సును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచాయని మరియు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పెంచారని అన్నారు. జమ్మూ మరియు కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మిజోరాం మరియు గోవాలు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారని అంతే కాకుండా. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య కళాశాలల అధ్యాపకులకు 60 నుంచి 65 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సును పెంచిందని అన్నారు. కాబట్టి పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచినట్లయితే సుమారు 141 మంది సీనియర్ ప్రొఫెసర్లను కొనసాగించవచ్చని, తద్వారా విద్యా మరియు పరిపాలనా విషయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సేవలందించడం మరియు మార్గనిర్దేశం చేసే విధంగా ఉంటుందని అన్నారు. కాబట్టి ఎచ్.ఆర్.డీ మరియు యూజీసీ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి…. రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో గత పదిహేనేళ్ళు గా ఎటువంటి నియామకాలు లేవని పీ.ఎచ్.డీ లు పూర్తి చేసి చాలీ చాలని జీతాలతో పార్ట్ టైం అధ్యాపకులుగా చాలా మంది వర్సిటీల్లో పనిచేస్తున్నారని వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ విశ్వ విద్యాలయాల్లో ఖాలీగా వున్న అసిస్టెంట్ టీచర్ల పోస్టులను వెంటనే భర్తీ చేస్తేనే విశ్వవిద్యాలయాలు వైభవాన్ని సంతరించుకుంటాయని, సత్వరం నియామకాలు చేపట్టే విషయంలో ప్రభుత్వం శ్రధ్ధ తీసుకొని విశ్వవిద్యాలయాలను కాపాడాలని కోరారు. తెలంగాణాలోని వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయసు పెంచడానికి ప్రభుత్వం సానుకూలంగా వుందని, సెప్టెంబర్ మొదటి వారం వరకు వీసీ ల నియామకాలు పూర్తి అవుతాయని ఆ తర్వాత విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారని అన్నారు. ప్రో.కోదండరాం కూడా ప్రభుత్వంతో పదవీ విరమణ వయసు పెంచే విషయం మరియు రిక్రూట్మెంట్ విషయం చర్చిస్తానని అన్నట్లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img