అక్షరశక్తి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్స్ట్రోక్తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని, లేనిపక్షంలో పనులను వాయిదా వేసుకుని ఇంటిపట్టునే ఉండటం మంచిదని అధికారులు సూచించారు. అలాగే పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ఎండలు తీవ్రతరమవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.