- ఖరారైన అభ్యర్థులకు పార్టీ పెద్దల ఫోన్
- తొలిజాబితాలోనే అవకాశం
- కాషాయం దళంలో జోష్
అక్షరశక్తి, వరంగల్ పశ్చిమ : ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా శనివారం రాత్రి విడుదల కానుంది. అధికారికంగా జాబితా విడుదలకు ముందే సంబంధిత అభ్యర్థులకు పార్టీ అగ్రనేతలు ఫోన్ చేసి జనంలోకి వెళ్లాలంటూ చెప్పినట్లు తెలిసింది. ఇందులో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకే అవకాశం కల్పించారు. ఈ మేరకు తొలిజాబితాలో ఆమెకు చోటు దక్కింది. బీజేపీ అభ్యర్థిగా రావు పద్మకు తొలి జాబితాలోనే అవకాశం దక్కడంతో కాషాయ దళంలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అనేక రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ సత్తా చాటాలన్న వ్యూహంతో ముందు నుంచీ పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారిస్తోంది. అనేక సమీకరణాలు, పరిణామాలు, సర్వేలు, అభిప్రాయాల అనంతరం.. రావు పద్మనే బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. వరంగల్ మహానగరంలో బీజేపీ బలోపేతానికి రావు పద్మ ఎంతో కృషి చేశారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇంటింటికీ బీజేపీ పేరుతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రధాని మోడీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కరోనా, వరంగల్ వరదల సమయంలో నగర ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం అన్ని కోణాల్లో పరిశీలన చేసి.. చివరకు వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా రావు పద్మకే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.