ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం యూసఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించిన బాలయ్య.. 300లకు పైగా చిత్రాల్లో నటించారు. పలు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పనిచేసి బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు సేవలందించారు. బాలయ్య మరణవార్తతో టాలివుడ్లో విషాదం నెలకొంది. బాలయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈయన మరణ వార్తపై బాలకృష్ణ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాడు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు.
‘సీనియర్ నటుడు మన్నవ బాలయ్య గారి మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. బాలయ్య గారు అద్భుతమైన నటులు, నాన్న గారితో కలిసి నటించారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా బాలయ్య తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’, ‘మిత్రుడు’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాల్లో బాలయ్య నటించిన సంగతి తెలిసిందే.