అక్షరశక్తి, హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్న తరుణంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ముంభైలో ఈ రకం కేసు బయటపడినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కంటే ఎక్స్ఈ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వడోదరకు చెందిన 60 ఏండ్ల వృద్ధుడిలో ఈ సరికొత్త వేరియంట్ను గుర్తించారు. ఎక్స్ఈ వేరియంట్ సోకినట్లుగా భావిస్తున్న వ్యక్తి నమూనాలను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) కి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది మాత్రం వెల్లడించలేదు.
ఒమిక్రాన్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగం
ఒమిక్రాన్లోని రెండు సబ్ వెర్షన్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఎక్స్ఈగా రూపాంతరం చెందాయి. తొలిసారి యునైటెడ్ కింగ్డమ్లో బయటపడిన ఈ వేరియంట్.. ఆ తర్వాత పలు దేశాలకు వ్యాపించింది. దీని వ్యాప్తి వేగం ఒమిక్రాన్ కంటే 10 రెట్లు ఎక్కువ కావడంతో కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నదని డబ్ల్యూటీఓ కూడా తెలిపింది. అయితే.. ప్రాణాంతకమైన తీవ్ర లక్షణాలు ఉండకపోవచ్చని పేర్కొంటుండటం గమనార్హం.