రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు
బాలికలపై అకృత్యాలకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాలికపై లైంగికదాడి చేసింది 9 ఏళ్ల బాలుడు కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. పక్కింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు తొమ్మిదేళ్ల బాలుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. థానె జిల్లాలోని ఉల్హాస్నగర్ టౌన్లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇరుగుపొరుగు ఫ్లాట్ల పిల్లలు అందరూ కలిసి ప్రతిరోజూ ఆటలాడుకునేవారు. ఆ కాంప్లెక్స్ లోనే తొమ్మిళ్ల అబ్బాయి, నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. రోజూలాగే ఈనెల 3న కూడా పాప ఆడుకుంటానంటూ మెట్లు దిగి కిందికి వెళ్లింది. తోటి పిల్లలతో కలిసి ఆటాడుకుంటుండగా, 9 ఏళ్ల బాలుడు ఆమెను బిల్డింగ్ వెనుక ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు.
బాలిక దుస్తులు తొలగించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణకాండ కొద్ది రోజులపాటు జరగ్గా, మర్మాయవాల్లో నొప్పిగా ఉందని ఆ చిన్నారి తన తల్లికి చెప్పడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో బాధిత కుటుంబం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడైన బాలుడిపై పోస్కో చట్టం, 376 (రేప్) సెక్షన్ కింద కేసు నమోదుచేసినప్పటికీ అతడిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఎవరో మాటలతో ఉపదేశించడం వల్లే బాలుడు.. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లవాడి మనసును కలుషితం చేసిన ఆ వ్యక్తిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.