గీసుగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ఫోరం
అక్షరశక్తి, గీసుగొండ : అవినీతి, అక్రమాల్లో కూరుకపోయిన బీఆర్ఎస్ పార్టీ అంతమే.. కాంగ్రెస్ పార్టీ పంతంగా పెట్టుకొని పని చేస్తామని గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, వాంకుడోతు మణిగోపాల్, కాయిత బిక్షపతి, దౌడు కోమల భరత్ అన్నారు. బుధవారం హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ పరకాల ఇంచార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ సౌజన్య, ఎంపీటీసీలు వాంకుడోతు మణిగోపాల్, కాయిత బిక్షపతి, దౌడు కోమల భరత్ మాట్లాడారు. పరకాల నియోజకవర్గంలో కేవలం ఎమ్మెల్యే కాంట్రాక్టుల కోసమే రోడ్డులు వేశారు తప్ప అభివృద్ధిలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. నాసిరకం పనులతో బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు దండుకున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పతనం మొదలైందన్నారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూములు పంచకుండా, అధికార పార్టీ నేతలే భూ కబ్జాలకు పాలుపడ్డ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రోజు రోజుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుల దాడులు, దౌర్జన్యాలు, ఆడగాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. గీసుగొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, హామీలు ఇవ్వడం, మోసం చేయడమే బీఆర్ఎస్ నైజం అని విమర్శించారు. పరకాల నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు దళితబంధు పథకం ఇచ్చారో ఎమ్మెల్యే ధర్మారెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గీసుగొండ మండల అధ్యక్షులు తుమ్మనపెల్లి శ్రీనివాస్, వంచనగిరి ఎంపీటీసీ సారంగం, జిల్లా నాయకులు చాడ కొమరారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఆకుల రుద్రప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, గ్రామ అధ్యక్షులు డౌడు ప్రవీణ్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Must Read