వాట్సప్లో క్వషన్ పేపర్..
తెలంగాణలో సోమవారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం అలా ఏం జరగలేదని కొట్టి పారేస్తున్నారు. పేపర్లను ఇన్విజిలేటర్లే లీక్ చేశారా ? లేదా అధికారుల స్థాయిలోనే లీక్ జరిగిందా ? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతస్థాయి విచారణ జరిపించి ఈ విషయంలో వాస్తవాలను వెలికితీయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే … వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ రోజు ఉదయం 9:37 కే టెన్త్ ప్రశ్నాపత్రం కొన్ని వాట్సాప్ గ్రూప్లలో వచ్చింది. దీంతో స్థానికంగా కొందరు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. కానీ వారు మాత్రం.. పేపర్ మనది కాదని బుకాయించినట్లు తెలుస్తోంది. అయితే, పరీక్ష ముగిసిన తర్వాత బయటకు వచ్చిన విద్యార్థుల వద్ద ఉన్న ప్రశ్నాపత్రాన్ని పరిశీలించగా.. వాట్సాప్లో వచ్చిన దానిని పోలినట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ అవడంతో డీఈవో హుటాహుటిన కలెక్టరేట్కు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నారు. అయితే.. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పేపర్ను వాట్సాప్ ద్వారా లీక్ చేసినట్లు గుర్తించిన అధికారులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Must Read