– వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : డయల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది వేగంగా స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ , పెట్రో కార్ పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముందుగా బ్లూకోల్ట్స్ , పెట్రోకార్ పోలీస్ సిబ్బంది ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు తీరుతెన్నులపై అధికారులు వివరించడంతో పాటు ఫిర్యాదుదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకుగాను తీసుకోవాల్సిన ముందుస్తు చర్యలపై అధికారులు సిబ్బంది సూచించారు. అనంతరం డయల్ 100 ఫిర్యాదులతో పాటు పెట్రోకార్ విధులు నిర్వహించే సమయంలో క్షేత్ర స్థాయిలో ఎదురౌవుతున్న సమస్యలను సిబ్బంది అధికారుల దృష్టికి తీసువెళ్ళారు.
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బ్లూకోల్ట్స్ సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ఫిర్యాదులు వచ్చిన వెంటనే నిర్ధేశించిన సమయాల్లో గ్రామీణా, పట్టణ ప్రాంతాల్లో డయల్ 100 ఫిర్యాదులపై స్పందించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది కేవలం పెట్రోలింగ్ విధులే కాకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు సంబంధించి ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని, అలాగే కేడీలను, రౌడీ షీటర్లను నిరంతరం తనీఖీ చేయాలని, ముఖ్యంగా పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది కొన్ని సందర్బాల్లో సమయస్పూర్తి విధులు నిర్వహించాల్సి వుంటుందని అన్నారు. అలాగే ప్రజలతో సున్నితంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖకు కిర్తీ ప్రతిష్టలు తీసుకరావాలని, నిజాయితీతో విధులు నిర్వహిస్తూ, ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు వుంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు డిసిపి రవి, ఏసిపిలు తిరుమల్, నందిరాం నాయక్, నర్సయ్య, భీంశర్మ, పార్థసారధి, జనార్థన్ రెడ్డితో పాటు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ ఠాణాలకు చెందిన ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.