దండకారణ్యంలో మళ్లీ అలజడి రేగింది. భద్రతా బలగాల క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. ఎండాకాలం కావడంతో కూంబింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. దానిని నిలువరించేందుకే మావోయిస్టులు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్బా వద్ద భద్రతా బలగాల క్యాంపుపై ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మావోయిస్టులు దాడి జరిపారు. అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లతో మావోయిస్టులు క్యాంపును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తుపాకులతోనూ కాల్పులు జరిపారు.
మెరుపుదాడి నుంచి తేరుకున్న భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కాగా, దాడిలో నలుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హెలికాప్టర్ల ద్వారా రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగుతున్నది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.