- రెండు శాఖల మధ్య భూ వివాదం
- పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
- రెవెన్యూ ఉద్యోగుల నిరసనలు
అక్షరశక్తి, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం మహా ముత్తరం గ్రామంలోని సర్వే నంబర్ 487లో గల ప్రభుత్వ భూమి రెవెన్యూ, ఫారెస్టు శాఖల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. రెండుశాఖలు పరస్పర విమర్శలకు, సవాళ్లకు దిగుతున్నాయి. ఏకంగా తహసీల్దార్పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు దాకా వెళ్లాయి. ఆ సర్వేనంబర్లోని భూమిలో హరిజన గిరిజనులు 40ఏళ్లుగా ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ పట్టాలు పొంది వ్యవసాయం చేసుకుంటున్న క్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి గెజిట్ సమర్పించకుండా అది ఫారెస్ట్ భూమి అని పేర్కొంటున్నారని రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నందున మహా ముత్తారం తహశీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం స్థానిక సర్పంచ్, గ్రామస్తులతో కలిసి విచారణ జరిపి ఇది ముమ్మాటికీ ప్రభుత్వ భూమి అని ఫారెస్ట్ భూమి కాదని తేల్చారని రెవెన్యూ అధికారులు అంటున్నారు. అయినా.. ఫారెస్ట్ భూమిలోకి రెవెన్యూ అధికారులు అక్రమంగా ప్రవేశించారంటూ తహశీల్దార్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం దురదృష్టకరమని ఈ ఘటనను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు గ్రామ రెవెన్యూ సహాయకులు నుండి అందరూ నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసనలు తెలిపారు. కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేవారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఎండీ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.