అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోట చేసుకుంది. నర్సంపేట రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన లో దన్నసరి లక్ష్మయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరు మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.