అక్షరశక్తి, మహబూబాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసబెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్న నిత్య పెళ్లికూతురు బాగోతం బట్టబయలైంది. చివరకు ఆమె మోసాన్ని తొమ్మిదో భర్త పసిగట్టి చిట్టా విప్పడంతో అందరూ విస్తుపోతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మ్యాట్రిమోనీ( పెళ్లి సంబంధాలు ) వెబ్ సైట్లో ఓ ఆంధ్రాకు చెందిన అబ్బాయికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా పెళ్లికి దారి తీసింది. తన ఇంటిల్లిపాదిని వెంటబెట్టుకుని ఆ మహిళ ఆంధ్రాలోని అబ్బాయి ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు. అయితే.. 2018లో పెళ్లి చేసుకున్న ఈ నవ దంపతులు రెండు నెలలు మాత్రమే కాపురం చేశారట. ఈ తక్కువ సమయంలోనే ఆ మహిళ తరుచూ ఫోన్లో మాట్లాడుతూ కోర్టు విషయాల్లో తలమునకలై ఉండేదట. ఏంటని ప్రశ్నిస్తే తనతో గొడవలకు దిగేదని భర్త వాపోతున్నారు. ఈ క్రమంలో ఓ రోజు బెంగుళూరు నుంచి అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లాలని పట్టుబడిందని, వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ వెళ్లాలని అనడంతో అనుమానం వచ్చిన భర్త అసలేం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడడంతో ఆమె బాగోతం బయటపడింది. ఏకంగా ఆమె ఎనిమిది వివాహాలు చేసుకుని తొమ్మిదోసారి తాను బుక్కయ్యానని భర్త విడాకులు కావాలని కోరాడు. దీంతో ఆ మహిళ భర్త తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది. దీంతో నివ్వెర పోయిన భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పాడు. ఎప్పుడు ఎక్కడ, ఎవరిని ఏ ఏడాదిలో పెళ్లి చేసుకుందో, ఎంత లాగిందో.. మొత్తం చిట్టా విప్పడంతో అందరూ నివ్వెరపోయారు. చివరకు టౌన్ పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.