అక్షరశక్తి, గూడూరు: ఎన్నికల ముంగిట మానుకోట బీఆర్ఎస్ లో గందరగోల పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందక.. మరోవైపు .. అడుగడుగునా జనం నిలదీతలు, నిరసనలతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు మా ఊరికి ఏం చేశారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ కోయగూడెంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను జనం అడ్డుకున్నారు. మా ఊరికి ఎందుకు వచ్చావు.. అంటూ ప్రశ్నించారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే ఏనాడు ఇటువైపు తిరిగి చూడలేదని చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని నిలదీశారు. మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పి తమను మోసం చేశారని ఆరోపించారు. ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక మా గ్రామంలో ప్రచారం చేయొద్దని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనం తిరగబడడంతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు చేసేది ఏమీ లేక అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు.