అక్షరశక్తి, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీలో అధికారికంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనడానికి హరితహోటల్కు వచ్చిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్లకు ప్రజా సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. ఇటీవల కేఎంసీ పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు బుధవారం ఉదయం హరితహోటల్కు చేరుకుని నిరసన తెలిపాయి. ఈడీ కేసులో ఇరుకున్న కవిత గురించి గిరిజన మంత్రిగా ఉన్న సత్యవతిరాథోడ్ మాట్లాడుతున్నారుగానీ.. గిరిజన బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే కనీస స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అయితే, ప్రజాసంఘాల నిరసనపై మంత్రి ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ప్రతీరోజు ప్రీతి కుటుంబంతో మాట్లాడుతున్నామని, వారికి న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అయినా.. ప్రజాసంఘాలు ఇలా చేయడం తగదని హితవుపలికారు.