వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట పట్టణంలోని రైల్వే కాలనీలో బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెండాడు.
వివరాల్లోకి వెళ్తే…. ఉత్తర ప్రదేశ్కు చెందిన సునీత, మల్కాన్ దంపతులు అజ్మీర్ వెళ్లేందుకు తమ కుమారుడు చోటు (8) తో కాజీపేట రైల్వే స్టేషన్ కు వచ్చారు. సంచార జాతులైన వీరు వంట చేసుకునేందుకు రైల్వే స్టేషన్ పక్కనే గల పార్కుకు గురువారం రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత బహిర్భూమి కోసం పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి చోటు వెళ్ళాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఆరు వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. ఎంత అరిచినా ఎవరికి వినిపించకపోవడంతో కుక్కలు సుమారు 15 నిమిషాల పాటు బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, కాజీపేట రైల్వే క్వార్టర్స్ లో వీధి కుక్కలు సంచరిస్తున్నాయని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. నాలుగు రోజుల కింద ఇదే ప్రదేశంలో ఓ బాలికపై, పది రోజుల క్రితం రైల్వే ఉద్యోగిపై కూడా వీధి కుక్కలు దాడి చేశాయని తెలిపారు.