- వరంగల్ పశ్చిమ టికెట్పై ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించాలి
- వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
- ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలందరికీ అండగా ఉంటానని హామీ
అక్షరశక్తి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా ఆలోచన చేయాలని, బీఆర్ఎస్కు అమ్ముడుపోయిన నాయకుడికి పార్టీ టికెట్ ఇవ్వడం హాస్యాస్పదమని వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. హైకమాండ్ నిర్ణయం మార్చుకోకుంటే తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపుతానని జంగా సవాల్ చేశారు. బుధవారం హన్మకొండలోని జక్రియా ఫంక్షన్ హాల్లో అనుచ రులు, అభిమానులతో జంగా రాఘవరెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి వరంగల్ పశ్చిమ నుంచి సుమారు నాలుగు వేల మంది మద్దతుదారులు హాజరయ్యారు. ఈసందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. హైకమాండ్కు అల్టిమేటం జారీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోకవర్గ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న అభ్యర్థి బీఆర్ఎస్, బీజేపీ తొత్తు అని ఆరోపించారు. తాను ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నానని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నానని, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తనకే టికెట్ వస్తుందని చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ఓటేసేందుకు ప్రజలు సి ద్ధంగా ఉన్నారని, కానీ మోసం చేసిన వారికి టికెట్ ఇస్తే గెలవరని స్పష్టంచేశారు. టికెట్ విషయంలో హైకమాండ్ పునరాలోచన చేయకపోతే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని జంగా అన్నారు.
లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీలో ఉంటానని జంగా రాఘవరెడ్డి తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రజలందరికీ ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. సొంతంగా రూ. 50 కోట్ల నిధులతో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కట్టిస్తానని, అదేవిధంగా ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ టౌన్ ప్రెసిడెంట్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, జంగా అభిమానులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.