- రాజీనామాకు సిద్ధమవుతున్న కీలక అనుచరులు?
- దశాబ్దకాలానికిపైగా రాజేందర్తో అడుగులు
- గత ఉప ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర
- తమను పట్టించుకోవడంలేదంటూ ఆవేదన
- బీఆర్ఎస్లో చేరే దిశగా అడుగులు..
- ఇప్పటికే పాడి కౌశిక్రెడ్డితో చర్చలు?
అక్షరశక్తి, హన్మకొండ : ఎన్నికల ముంగిట హజూరాబాద్ నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు జమ్మికుంటలో బీజేపీ ఎన్నికల సభ నిర్వహిస్తుండగా మరోవైపు.. ఇదే రోజున ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు భారీ షాక్ ఇచ్చేందుకు పలువురు కీలక అనుచరులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా దశాబ్దానికిపైగా ఈటలతో కలిసి అడుగులు వేసిన యువనాయకులు.. బీఆర్ఎస్లో చేరి పాడి కౌశిక్రెడ్డితో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం.
రాజీనామాకు సిద్ధపడుతున్న వారిలో.. బీజేవైఎం హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి జవ్వాజి కుమారస్వామి(ఇల్లందకుంట మండలం), వీణవంక మండలానికి చెందిన అనుచరులు అఖిల్గౌడ్, పొన్నాల అనిల్, కమలాపూర్ మండలానికి చెందిన బీజేవైఎం హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్క అరవింద్ గౌడ్, ఉప్పల్ గ్రామానికి చెందిన బూత్ అధ్యక్షుడు కనుకుల రాజు, జమ్మికుంట మండలానికి చెందిన జానీబాయ్ ఉన్నట్లు తెలుస్తోంది.
దశాబ్దకాలానికిపైగా ఈటలతో అడుగులు
రాజీనామాకు సిద్ధమవుతున్న నాయకులు సమారు 2005 నుంచి ఈటల రాజేందర్తో కలిసి నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడంతో వారు కూడా ఆయనతోపాటు వచ్చేశారు. ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికల్లో ఈటల గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అయితే.. ఈటల రాజేందర్తో లాభపడిన నేతలు వెన్నుపోటుపొడిచి వెళ్లిపోయినా.. తాము ఏమీ ఆశించకుండా ఆయనతోనే ఉన్నామని యువనాయకులు ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు యువనాయకులు.. ఈటలను కలిసి.. తమ పరిస్థితి ఏమిటంటూ.. ఆవేదనను వెలిబుచ్చగా.. ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోండి.. అని అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన యువనాయకులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరాలన్ననిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 16న బీజేపీ ఎన్నికల సభరోజే.. ఈటలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డితో కూడా సదరు యువనాయకులు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.