వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్
అక్షరశక్తి, కాజీపేట : వ్యవసాయదారులను మోసానికి గురిచేసేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన రవిశెట్టి రవిబాబు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని రైతన్నల నుండి ధాన్యం కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సిన డబ్బులను ఎగవేతకు పాల్పడినందుకు నిందితుడిపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ తొలిసారిగా పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ నిందితుడికి సోమవారం కాజీపేట ఏసీపీ కార్యాలయంలో అందజేసి చర్లపల్లి జైలుకి తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. నిందితుడు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వ్యవసాయ దారుల నుండి సుమారు 6 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాడు. రైతులకు చెల్లించాల్సి సుమారు కోటిన్నర పైగా ధాన్యం డబ్బులను చెల్లించకుండా డబ్బు ఎగవేతకు పాల్పడ్డాడు. వ్యవసాయదారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎల్కతుర్తి, ముల్కనూరు, వంగర పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదు కావడంతో నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఏసీపీ తెలిపారు. వ్యవసాయదారుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు వ్యాపారస్తులు సకాలంలో చెల్లింపులు చేయాలని, అలాకాకుండా వారికి ఇచ్చే డబ్బులు ఎగవేత ధోరణికి పాల్పడితే సహించేది లేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎల్కతుర్తి ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ మహేందర్ పాల్గొన్నారు.