- పరకాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు
- నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అక్షరశక్తి, పరకాల : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిరుద్యోగుల కోసం ఓ బృహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థుల కోసం ప్రభుత్వమే ఉచితంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అండగా నిలిచారు. పోటీ పరీక్షల్లో రాణించేలా వారికి తగిన శిక్షణ తరగతులను ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చారు. చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీతోపాటు పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు మండలాల్లోని నిరుద్యోగులకు నేటి నుంచి ఉచితంగా కోచింగ్ అందించనున్నారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్క్షతలు
పరకాల పట్టణంలోని డీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ధర్మారెడ్డితోపాటు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హాజరుకానున్నారు. ఈమేరకు నిరుద్యోగ యువతీ, యవకులు హాజరై శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోరారు. కాగా, పరకాల పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడంపై నిరుద్యోగ యువతీ, యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్ఙతలు తెలుపుతున్నారు.