- పదో తరగతిలో ఫేయిల్..
- పదేళ్లుగా శివునిపల్లిలో ప్రియాంక క్లినిక్ నిర్వహణ
- అర్హత సర్టిఫికెట్లు లేకుండానే వైద్యం
- టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిలో పట్టివేత
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : మరో నకిలీ వైద్యుడి బాగోతం బట్టబయలైంది. పదో తరగతిలో ఫేయిల్ అయి.. ఏకంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ పరిధిలోని శివునిపల్లిలో ప్రియాంక క్లినిక్ పేరుతో ఆస్పత్రి నిర్వహిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం టాస్క్ఫోర్సు పోలీసులు జరిపిన దాడుల్లో నకిలీ డాక్టర్ అసలు కథ బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆకాష్ కుమార్ బిస్వాస్ పదో తరగతిలో ఫేయిల్ అయ్యాడు. తన తాత వద్ద కొంతకాలం పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండానే శివునిపల్లిలో ప్రియాంక క్లినిక్ పేరుతో ఆస్పత్రిని పదేళ్లుగా నిర్వహిస్తున్నాడు. పైల్స్, ఫిషర్, రక్తస్రావం పైల్స్, ఫిస్టులా, హైడ్రోసెల్ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపుతానంటూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నాడు. రోగులకు అల్లోపతి, ఆయుర్వేద మందులతో చికిత్స అందిస్తున్నాడు. అంతేగాకుండా, అతను కమీషన్ ప్రాతిపదికన వరంగల్ ట్రై సిటీలలోని వివిధ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ సెంటర్కు రోగులను రిఫర్ చేసేవాడు. ఇలా పదేళ్లలో సుమారు 3650మందికి నకిలీ వైద్యుడు చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్ ఘన్పూర్ పోలీసులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఏసీపీ డాక్టర్. ఎం. జితేందర్ రెడ్డి, ఏసీపీ వి. నరేష్ కుమార్, ఎన్. వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్లు
వి. లవన్ కుమార్, ఎస్సై తెలిపారు.