- మార్కులు సాకుగా చూపి లైంగిక వేధింపులు
- చితకబాదిన తల్లిందండ్రులు
- పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
అక్షరశక్తి, మహబూబాబాద్ : విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధి చూపాడు. పరీక్షలను అడ్డుపెట్టుకుని.. మార్కులను అవకాశంగా చూపి బిడ్డల్లాంటి విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు… పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మహేందర్ పదోతరగతి విద్యార్థినులతో కొంత కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే మీ పని చేస్తా అంటూ బెదిరిస్తున్నాడు. చేతుల మీద కొట్టడంతో పాటు లైంగికంగా వేధించాడు. అయితే ఈ విషయాన్ని ఓ విద్యార్థిని తమ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు మహేందర్ను చితకబాదారు. అనంతరం అతడిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడి స్వగ్రామం పర్వతగిరి మండలం కొండాపురం కాగా.. దాట్ల గ్రామంలో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.
Must Read