లక్షలాది మంది సభికుల్ని ఆకట్టుకున్న గానం మూగవోయింది. తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన సాయిచంద్ అకాల మరణంతో తెలంగాణ కళాకారులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న సాయంత్రం వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన సాయిచంద్… కారుకొండ ఫామ్ హౌస్లో గుండెపోటుకు గు రవడంతో కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే తుది శ్వాస విడిచారు. తన ఆట, పాట, మాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించడంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించాడు. ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన కొన్ని పాటలు ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ముఖ్యంగా రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియదురా.. నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మ దేవా… తల్లి మనసేమిటో నువ్వు ఎరగవురా… అనే పాట సాయిచంద్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యునివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన ధూందాం కార్యక్రమంలో సాయిచంద్ ఈ పాట పాడారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి
తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని కొనియాడారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణకు తీరని లోటు : రేవంత్రెడ్డి
సాయిచంద్ మృతిపట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. సాయిచంద్ అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు రేవతంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రముఖుల నివాళి
ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రసమయి బాలకిషన్, టీఎస్ఎమ్మెస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
Must Read