- దామ్యాతండాలోని సర్వే నంబర్ 395లో
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ - అక్షరశక్తి ఎఫెక్ట్ !
- మానుకోటలో భూబాగోతం వెలుగులోకి..
- 35 ఎకరాల లావని పట్టా భూమిని మాయంచేసిన కబ్జాదారులు
- భూవివాదం కోర్టు పరిధిలో ఉన్నా వెంచర్గా మార్చుకుంటున్న వైనం
- భూ మాఫియాపై అక్షరశక్తి కథనం
- ఎట్టకేలకు స్పందించిన యంత్రాంగం
- వెంచర్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు
- పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతున్న బాధితులు
అక్షరశక్తి, మహబూబాబాద్ : మానుకోట జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా బరితెగిస్తోంది. కొందరు అధి కారులు, ప్రజాప్రతినిధుల అండతో.. ప్రభుత్వ భూములే కాదు… ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల భూములను కూ డా దర్జాగా కబ్జా చేస్తున్నారు. కొండలు, గుట్టలు తొవ్వేస్తూ, చెరువులు, కుంటలు మింగేస్తూ.. వెంచర్లుగా మా ర్చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడటమేగాక, భౌతిక దాడులకు సైతం దిగుతు న్నారు. మానుకోట మండలంలోని దామ్యా తండా సమీపంలో గల 35 ఎకరాల లావని పట్టా భూమిలో రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసి వెంచర్గా మార్చేసింది. ఈ భూ వివాదం కోర్టు పరిధిలో ఉన్నా కూడా రాత్రికి రాత్రి పనులు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమాయక బాధితులను బెదిరింపులకు గురి చేస్తూ తమ పని కానిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈనేపథ్యంలోనే అక్షరశక్తి దినపత్రిక రంగంలోకి దిగి, భూభాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. దీంతో ఎట్టకేలకు స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది సదర్ వెంచర్ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇది అక్రమ లేఅవుట్.. ఇందులో ప్లాట్లు అమ్మడం, కొనడం నిషేధం.. అంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది..
మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని దామ్యా తండా ప్రస్తుతం గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది. 60 ఏళ్ల నుంచి బానోత్ నరానీ పేరున సర్వే నెంబర్ 395లో 35 ఎకరాల భూమి లావని పట్టాగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. అయితే ఈ భూమిలో హైదరాబాద్కు చెందిన వ్యాపారి 1991 – 2012 వరకు నల్లరాయి క్వారీ నడిపించాడు. ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలో మానుకోట జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ధరలు విపరీతంగా పెరిగడంతో కబ్జాదారులు రెచ్చిపోయారు. వీరికి కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. దీంతో 35 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించి సర్వే నెంబర్ 398/ 399 లో పట్టా చేయించుకున్నారు. అంతేకాకుండా దీనికి అనుకొని ఉన్న ఎస్సారెస్పీకి చెందిన కొంత భూమిని కూడా కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 35 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు తెలియగానే సదరు భూమి యజమాని అధికారులు చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు.
అయినా ఆగని పనులు..
భూమి ఆక్రమణకు గురి కావడంపై బాధితులు గ్రీవెన్స్ సెల్ లోనూ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సర్వేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అది నరానీ పేరున ఉన్న భూమిగా తేల్చారని బాధితులు చెబుతున్నారు. అయి నా కూడా కబ్జాదారులు వెనక్కి తగ్గలేదు. పొద్దంతా సైలెంట్ గా ఉంటూనే.. రాత్రి వేళల్లో మాత్రం పనులు చేపట్టేవారు. దీంతో బాధితులు అక్షరశక్తిని ఆశ్రయించగా, భూకబ్జా ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చింది.
దీంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు సదరు వెంచర్లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంతోనైనా కబ్జాదారులు సైలెంట్గా ఉంటారా.. లేక యధావిధిగా తమ ప ని తాము కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి. మానుకోట జిల్లాకు చెందిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో ఖమ్మంకు చెందిన ఓ బడా రియల్టర్ కబ్జా దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.