బీజేపీ నాయకుడు దేవరకొండ అనిల్కుమార్
అక్షరశక్తి, వర్ధన్నపేట : వర్ధన్నపేటలో రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేసిన అభివృద్ధి శూన్యమని బీజేపీ నియోజకవర్గ నాయకులు, పార్టీ ఒకటో డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ అనిల్కుమార్ విమర్శించారు. ఒకటో డివిజన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే వివక్ష చూపడాన్ని నిరసిస్తూ బుధవారం పెగడపల్లిలో దేవరకొండ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గుంతలమయమైన ప్రధాన రహదారిపై పూలు చల్లుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్కుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే అరూరి రమేష్ విలీన గ్రామాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగడపల్లిలో ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైనా గత ఐదేళ్లుగా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ ఉన్నారనే వివక్ష చూపుతూ డివిజన్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
గత రెండేళ్లుగా కేవలం కార్పొరేటర్ నిధులతోనే కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధి నిధుల కోసం పలుమార్లు ఎమ్మెల్యే అరూరిని, మేయర్ను, మున్సిపల్ కమిషనర్ను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ పరిధిలోని ముచ్చెర్ల, పలివేల్పుల, ఎర్రగట్టు గుట్ట ప్రాంతాల్లో కూడా అంతర్గత రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రెండుసార్లు గెలిచినా.. అభివృద్ధి చేయని అరూరి రమేష్.. మరొకసారి గెలిచి మంత్రి అయితేనే చేస్తారా..? అని ప్రశ్నించారు. 9 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి చేయని అరూరికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాంపల్లి శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గరిగే మాధవి, తాబెటి రమేష్, బిట్ల రాజేందర్, లింగాల కుమార్, చల్లా ప్రశాంత్ రెడ్డి, రుద్రారపు స్వామి, అలువాల రాజు, తిరుపతి యాదవ్, సకినాల లింగయ్య, ఎల్లగౌడ్, బొంత మహిపాల్, పూజారి కుమార్, నాందిష్ తదితరులు పాల్గొన్నారు.