టీపీసీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాస్రెడ్డి
అక్షరశక్తి, మహబూబాబాద్ : జూనియర్ లెక్చరర్ల నియామకాల్లో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీలో అభ్యర్థుల వయో పరిమితిని 52 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ (కాకతీయ) ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకెపల్లి శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు మానుకోట పట్టణంలోని టీపీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కుదురుపాక జనార్థన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 25 ఏళ్ల నుంచి జూనియర్ లెక్చరర్ల నియామకానికి మెగా నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు. దీంతో సుమారు లక్ష మంది వయోపరిమితి 50 సంవత్సరాలు దాటి అనర్హతకు గురవుతున్నారన్నారు. వాస్తవానికి వారంతా గత పాతికేళ్ల నుండి ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్తో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్ , ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల బోధనలో అపార అనుభవాన్ని కలిగి ఉన్నారన్నారు. అంతేగాకుండా ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజినీర్లుగా తీర్చిదిద్ది భారతదేశ విద్యాబోధన రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. కావున వీరందరిని దృష్టిపెట్టుకుని వయోపరిమితిని 52 సంవత్సరాల వరకు పెంచి నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియామకం ద్వారా ఆశిస్తున్న ప్రతిభావంతులైన, నిపుణులైన లెక్చరర్లు ప్రభుత్వానికి లభించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని పరిశీలించి సరైన న్యాయం చేయాలని శ్రీనివాస్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కడుతుల జనార్ధన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మగాని ప్రమోద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీణవంక రాజు, రాష్ట్ర కార్యదర్శి నీలం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ హరిలాల్, పట్టణ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేష్, లెక్చరర్లు పాల్గొన్నారు.