- రూ. 7,75,000 విలువ గల బంగారం, వెండి స్వాధీనం
అక్షరశక్తి, వరంగల్ : ఇండ్ల తాళాలు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడిన నిందితుడిని వరంగల్ సీసీ ఎస్, నర్సంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ కూలీ పని, పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండ్ల కొరకు తన దగ్గరకు వచ్చి పోయే ధనికులను చూసి వాళ్ళలాగే తాను కూడా పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించి బంగ్లా కట్టుకొని విలాసవంతమైన జీవితం గడపాలనే కోరిక కలిగి, పండ్లు అమ్మగా వచ్చిన డబ్బులతో తన కోరిక తీరదని బావించి సులువుగా డబ్బులు సంపాదించటానికి దొంగతనాలు చేయాలనీ ఎంచుకున్నాడు. ఇందులో భాగంగా నర్సంపేట చుట్ట ప్రక్కల ఏరియాలలో ఇండ్ల తాళాలు పగలగొట్టి అనేక దొంగతనాలకు పాల్పడినాడు. నర్సంపేట డివిజన్ లోని నర్సంపేట పీఎస్ పరిధిలో 04, దుగొండి పరిధిలో01, హన్మకొండ డివిజన్ పరిధిలోని హన్మకొండ, కేయూసీ, వరంగల్ డివిజన్ లోని మిల్స్ కాలనీ పీఎస్, కాజిపేట్ డివిజన్ లోని హసనపర్తి పీఎస్ పరిధులలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 09-దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై సంబంధిత పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కాగా వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి సూచనల మేరకు, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట లక్ష్మి, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్ పుష్ప, క్రైమ్ ఏసీపీ డేవిడ్ రాజు, నర్సంపేట ఏసీపీ సంపత్ రావు అదేశానుసారం సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస రావు, నర్సంపేట ఇన్స్పెక్టర్ పులి రమేష్ క్రైమ్ టీమ్స్ కలిసి నిందితుడు తాను దొంగిలించిన బంగారు నగలను వరంగల్ లో అమ్ముటకు గాను నర్సంపేట బస్టాండ్ వద్దకు వచ్చి ఉన్నాడనే నమ్మకమైన సమాచారం రాగా వెంటనే వెళ్లి నిందితుడిని పట్టుకుని తన నుంచి దొంగతనానికి సంబందించిన బంగారు వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని సీపీ తరుణ్ జోషి అభినందించారు.
Must Read