అక్షరశక్తి, రేగొండ : వంట విషయంలో ప్రారంభమైన ఘర్షణ.. ఓ కార్మికుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మేస్త్రీ పనిచేయడానికి రెండు నెలల కిందట బీహార్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు కార్మికులు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వారి మధ్య వంట ఆలస్యం అవడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో ఓ కార్మికుడిపై తోటి కార్మికులు కర్రలు, ఇటుక లతో దాడి చేశారు. ఈ ఘటనలో బిహార్ రాష్ట్రం కదారియా గ్రామానికి చెందిన విరంచి టాంటి(56) మృతిచెందాడు. దాడి చేసిన వారిలో చంద్రశేఖర్, దివాన్షు, అమితాబ్ లు పరారీలో ఉన్నారు. సునీల్ శర్మ, మాంటుదాస్, అనిల్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.