జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్ చేస్తున్న బండారి నరేందర్ ఒక్క సారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు సీపీఆర్ చేసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. దీంతో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇదిలా ఉంటే.. జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత టార్గెట్ గా ఫ్లెక్సీలు వెలవడం కలకలం రేపుతోంది. మెట్ పల్లి ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీలలో నిరుపేదలకు కేసీఆర్ ఇచ్చిన 120 గజాల డబుల్ బెడ్ రూం ఇళ్లు అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. అలాగే 500 కోట్లతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఎన్ ఆర్ ఐ కిసాన్ సెల్.. సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటాడు గాని మాట తప్పడని బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్ లో పేర్కొన్నారు.