అక్షరశక్తి, హైదరాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పాడ్లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మల పెన్పాడ్కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. శ్రీను గౌడ్కు వ్యవసాయ భూమి ఉంది. దానిని తమకు పంచివ్వాలని గత కొంత కాలంగా కొడుకులిద్దరు తండ్రితో గొడవపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తండ్రిపై గొడ్డలి, కత్తితో దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీను గౌడ్ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.