కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్ ఎటాక్
అక్షరశక్తి, హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్ చెంపలు వాయించాలని రేవంత్ అన్నారు. కాంగ్రెస్లో చేరి తన తండ్రి తప్పు చేశారని.. తర్వాత తమ పార్టీపై మాట్లాడితే బాగుంటుందంటూ ఆయన హితవు పలికారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే మొదలైందని.. సింగిల్ విండో డైరెక్టర్గా, ఎమ్మెల్యేగా రెండోసారి ఓడిపోయారని రేవంత్ గుర్తుచేశారు. వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయగా… వాటికి కౌంటర్గా మంత్రి కేటీఆర్ రాహుల్పై విరుచుకుపడ్డారు. రాహుల్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్రెడ్డి ఖండించారు. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్, కేటీఆర్పై విరుచుకుపడ్డారు.
ఆ అర్హత కేటీఆర్కు లేదు
గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా… వేరే వ్యక్తులకు అవకాశం కల్పించారన్నారు. కానీ.. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో దళితుడైన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఓర్వలేక… కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. పారిపోయే చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనన్న ఆయన… కేసీఆర్ సిద్ధిపేట నుంచి కరీంనగర్ కు, అక్కడి నుంచి మహబూబ్ నగర్ కు… అక్కడి నుంచి గజ్వేల్ కు పారిపోయారని అన్నారు. కేసీఆర్ వెళ్లి శరత్ పవార్, స్టాలిన్ , మమతాబెనర్జీ లను కలవొచ్చు.. రాహుల్ గాంధీ వస్తే టూరిస్ట్ అంటారా అని నిలదీశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ సభతో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నాయకుల్లో గుబులు మొదలైందన్న రేవంత్… కలుగులోని ఎలుకల్లా బయటకి వచ్చి… వారంతా రాహుల్ ను విమర్శించే పనిలో పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, యాదగిరి గుట్ట, అమరవీరుల స్థూప నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని స్పష్టం చేశారు.
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు భరోసా కల్పించామని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానానికి, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, ధరణీ పోర్టల్ రద్దు సహా 9 తీర్మానాలు తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు చేరాయని రేవంత్ పేర్కొన్నారు. దీనిపై తమకు సంతోషంగా వుందన్నారు. టీఆర్ఎస్, కేటీఆర్ అహంభావంతో ప్రజాస్వామ్యం అంటే అవగాహన లేని విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన సమయంలో కేసీఆర్ సింగిల్ విండో డైరెక్టర్గా ఓడిపోయినా.. ఆయనను అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఛైర్మన్గా నియమించారని టీ పీసీసీ చీఫ్ తెలిపారు. రాహుల్ గాంధీ అమేధీలో ఓడిపోయారని.. కానీ వయ్నాడ్లో గెలిచారని రేవంత్ గుర్తుచేశారు.