- టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
- మహబూబాబాద్ పట్టణంలో కలకలం
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. మానుకోట మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ గురువారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… పట్టణంలోని పత్తిపాక వద్ద బైక్పై వెళ్తున్న కౌన్సిలర్ బానోత్ రవినాయక్ను వెనుక నుంచి దుండగులు ట్రాక్టర్తో ఢీకొట్టారు. దీంతో కిందపడిన రవినాయక్ను నలుగురు వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరికి పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న రవినాయక్ను స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించగా, మార్గ మధ్యలోనే మృతిచెందాడు. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజన కౌన్సిలర్ను సిటీ నడిబొడ్డున హత్య చేయడం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా దవాఖానకు తరలించారు.
మానుకోటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల కోసం గిరిజన రైతులకు చెందిన భూములను ప్రభుత్వం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా బాధిత గిరిజన రైతుల పక్షాన కౌన్సిలర్ బానోత్ రవినాయక్ పెద్ద ఎత్తున పోరాటం చేశారు. గిరిజన మహిళలతో కలిసి పట్టణంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అంతేగాక హైకోర్టులో కేసు వేయగా, స్టే ఆర్డర్ వచ్చింది.