అక్షరశక్తి, హైదరాబాద్ : ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్, వంటనూనెతోపాటు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు సగటు మధ్య తరగతి జీవిపై మళ్లీ
గ్యాస్ బండపడింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. మరి ఎంత పెరిగాయి.. ? ఏ నగరంలో ఎంత రేటుందో చూద్దాం.
దేశంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.102.50 పెరిగింది. హైదరాబాద్లో ఆ సిలిండర్ ధర రూ.2,562.50కి చేరింది. ఢిల్లీలో రూ.2,355.50, ముంబైలో రూ.2,329.50, కోల్కతాలో రూ.2,477.50, చెన్నైలో రూ.2,508కి వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. ఢిల్లీలో ఐదు కిలోల సిలిండర్ ధర రూ.655గా ఉంది. గత నెల 1న వాణిజ్య సిలిండర్పై రూ.268.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రూ.102.50 పెరగడంతో 2 నెలల్లోనే రూ.372 పెరిగినట్లయింది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరగలేదు. 14.2 కిలోల సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.1,002గా ఉండగా, కోల్కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50, ఢిల్లీలో రూ.949.50, ముంబైలో రూ.949.50గా ఉంది.