మానుకోట ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు
అక్షరశక్తి, మహబూబాబాద్ : కేసీఆరే మాకు తోపు.. మాకు గ్రూపులు లేవు.. మేమంతా కేసీఆర్ దయతోనే విజయం సాధిస్తున్నాం.. అని మహబూబాబాద్ ఎంపీ, జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ.. నాన్న నాకు రాజకీయ ఓనమాలు నేర్పారని, ఆయన స్ఫూర్తి తోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తనకు బాబాయ్ అని అన్నారు. మహబూబాబాద్ ఎల్లమ్మ సాక్షిగా ఆయన ఆశీస్సులు ఉండాలన్నారు. కేసీఆర్ తనపై నమ్మకం తోనే ఈ బాధ్యత అప్పజెప్పారని అన్నారు.
సారు మనస్సును గెలిచే విధంగా పని చేస్తానన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. చంద్రశేఖరుని దయతో గిరిజన జిల్లా అయ్యిందన్నారు. 10వేల కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు అయ్యిందన్నారు. దీంతో 300వందల పడకల దవాఖాన వస్తుందన్నారు. ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడుతూ… బయటకు ఒకటి లోపల ఇంకొకటి పెట్టుకుంటే కేసీఆర్ ముందు పప్పులు ఉడకవు అని అన్నారు. అందరినీ కలుపుకొని పోయే సమర్థత ఉన్న నాయకురాలిగా కవితను గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మునిసిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, కే ఎస్ యెన్ రెడ్డి, గ్రంధాలయ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, జెడ్పి చైర్మెన్ నూకల వెంకటేశ్వర్ రావు, వివిధ మండలాల టీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.