- ఇళయరాజా ఇజ్జత్ తీస్తున్న నెటిజన్లు, దళిత సంఘాలు, పలు పార్టీలు
- మరో వివాదంలో దిగ్గజ సంగీత దర్శకుడు
భారతదేశ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. దశాబ్దాలపాటు దేశాన్ని ఉర్రూతలూగించే సంగీతాన్ని అందించిన ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులోనూ యువ సంగీతకారులతో కలిసి పనిచేస్తూ సత్తా చాటుకుంటున్నారు. తాను ట్యూన్ చేసిన పాటలకు రాయల్టీ చెల్లించకుండా మ్యూజికల్ నైట్స్ లో పాడటానికి వీల్లేదంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికే లీగల్ నోటీసులు పంపిన ఉదంతం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంకాగా, తాజాగా.. ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు మరోమారు సర్వత్ర చర్చనీయాంశం అవుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రధాని నరేంద్రమోడీతో పోల్చిన మ్యూజిక్ మాస్ట్రోపై పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు, దూషణలు వెల్లువెత్తుతున్నాయి.
‘అంబేడ్కర్ అండ్ మోడీ: రీఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మెర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే పుస్తకానికి ఇళయరాజా రాసిన ముందుమాట వివాదాస్పదమైంది. పుస్తకం ముందుమాటలో..‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రధాని మోదీ వ్యక్తిత్వాల మధ్య ఆకట్టుకునే సామ్యమైన అంశాలు కొన్నింటిని ప్రస్తావించారు. ఈ ఇద్దరూ సామాజికంగా బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొనే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించినవారు. ఇద్దరూ పేదరికాన్ని అనుభవించారు. సామాజిక అణిచివేతను దగ్గరగా చూసినవారు. పేదరికాన్ని, అణిచివేతను కూల్చేసేందుకు కృషిచేసినవారు. ఇద్దరూ దేశం కోసం పెద్దపెద్ద కలలు కన్నారు. వాటిని ఆచరణలో అమలుచేయాలని భావించారు’ అని ఇళయరాజా పేర్కొన్నారు. అంతేగాక, (ముస్లిం) మహిళలకు అనుకూలమైన ట్రిపుల్ తలాక్ చట్టం, బాలికా విద్యకు బేటీ బచావో..బేటీ పడావోలాంటి పథకాలను అమలుచేసిన ప్రధాని మోదీని చూసి అంబేద్కర్ గర్వపడతారని కూడా ఇళయరాజా ప్రశంసించారు.
కాగా, పలు పార్టీల నేతలు, నెటిజన్లు.. ఇళయరాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజావి పరువు, బరువు తక్కువ మాటలని తిట్టిపోశారు. వర్ణవ్యవస్థలో అణిచివేతకుగురైన దళితల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ పనిచేస్తే.. మోదీ మనుధర్మ వ్యవస్థకు చెందినవారని.. ఇద్దరిని పోల్చడానికి వీలులేదని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఎలంగొవాన్ విమర్శించారు.తమిళనాడు సహా పలు రాష్ట్రాల దళిత సంఘాలు, నెటిజన్లు రాజాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మోడీని అంబేడ్కర్తో పోల్చడమేంటని విమర్శిస్తున్నాయి.