- వరంగల్ సభలో రాహుల్ గాంధీ
అక్షరశక్తి, హన్మకొండ : మన రాష్ట్రం కొత్త రాష్ట్రమని, నవరాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. ఇది చాలా సులువుగా ఏర్పడలేదని అమ్మలు అక్కలు, వారి శ్రమతో, కన్నీళ్లతో ఏర్పడిందన్నారు. ఏ ఒక్కరికోసమో తెలంగాణ ఏర్పడలేదని ఇక్కడ ఉన్న అన్నివర్గాల ప్రజల కోసం తెలంగాణ ఏర్పడిందన్నారు. రానున్న కాలంలో సుభిక్షమైన రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎనిమిదేండ్లుగా పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని కొన్ని విషయాలను అడుగుతున్నానన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతు ఆత్మహత్యలకు, వారి కుటుంబాల దుస్థితికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీ అందరి కలను నెరవేర్చడానికి వీరయోధులు పోరాటం చేసిందని, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసిందన్నారు. ప్రధానంగా సోనియా గాంధీ తెలంగాణ సాధనలో ముందడుగు వేసి రాష్ట్రాన్ని ఇచ్చారని, పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజల, రైతుల, బడుగుల ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆశించామని కానీ అది నెరవేరలేదని, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఒక రాజులా ఉన్నాడని విమర్శించారు. సీఎం అనే వారు ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తాడని, కానీ, రాజు ప్రజల మాట వినడని, నచ్చినట్టు పరిపాలన చేస్తున్నాడన్నారు. చత్తీస్ఘడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు రెండు హామీలు ఇచ్చామని ఒకటి రుణమాఫీ, రెండోది వరికి క్వింటాల్కు రూ.2500తో వరిధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాపారుల మాట వింటున్నాడుగానీ రైతుల మాట మాత్రం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు రాబోయే కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని హామీ ఇచ్చారు. మేం చెప్పే మాటలు వట్టిమాటలు కాదని తెలంగాణ రైతుల ప్రగతి కోసం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీతోపాటు రైతులకు ప్రతీ ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఇది డిక్లరేషన్ కాదని, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని అన్నారు.
Must Read