అక్షరశక్తి, వరంగల్ : 4వ బెటాలియన్ మామునూర్ క్యాంప్లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నాలుగో బెటాలియన్ కమాండెంట్ డీ.శివప్రసాద్ రెడ్డి బెటాలియన్ కమాండ్ కంట్రోల్ భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కమాండెంట్ చేతులమీదుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సేవా పతకాలు, ఉత్కృష్ట సేవ పతకాలు, అతి ఉత్కృష్ట సేవా పతకాలను సిబ్బందికి ప్రదానం చేశారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు అందించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతోమంది మేధావుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన గణతంత్ర వ్యవస్థలో ఉన్నందుకు గర్వపడాలని, పోలీసులు సర్వీసులోకి వచ్చేముందు జాతీయ పతాకంపై ప్రమాణం చేసి సర్వీస్ లోకి అడుగు పెడతామని, ఈ విషయాన్ని గుర్తెరిగి దేశ సార్వభౌమత్వానికి పాటుపడాలని కమాండెంట్ పిలుపునిచ్చారు. విధిగా మనం చేయవలసిన పని అలసత్వం లేకుండా చేయడమే దేశభక్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వేణుగోపాల్ రెడ్డి, రాంబాబు, జయరామ్, ఆర్ఐలు రమేష్, ఏవీయన్ రెడ్డి, కిరణ్, నాగేశ్వరరావు, దయశీల, చంద్రన్న, అశోక్, ఆర్ఎస్ఐ నాగరాజు, యూనిట్ మెడికల్ ఆఫీసర్ విజయ్, లతా సంగి, బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.