- నిరుపేద వ్యవసాయ కుటుంబం
- చదువంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే..
- తలకుబలమైన గాయమైనా కుంగిపోని ధైర్యం
- స్వయంకృషి, పట్టుదల, దృఢసంకల్పం ఆమె సొంతం
- నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గొల్లపల్లి దివ్య
- మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం
- మడికొండలో మొదటి పోస్టింగ్..
- అక్షరశక్తి, మడికొండ : ఉత్సాహంతో శ్రమించడం.. అలసటను ఆనందంగా అనుభవించడం.. ఇవి విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.. అని అంటారు స్వామి వివేకానంద. ఈ మాటల స్ఫూర్తితోనే తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది గొల్లిపెల్లి దివ్య. స్వయంకృషి, పట్టుదల, దృఢసంకల్పంతో జీవితంలో ఉన్నతస్థాయి దిశగా నడుస్తోంది. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి, ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లోనే చదువుకుని అమ్మానాన్నలు, గురువుల ప్రోత్సాహంతో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లా మడికొండ పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదువుకుని.. అన్ని అవకాశాలు ఉండి.. ఆత్మస్థైర్యం, సంకల్పబలం లేక భవిష్యత్ను అంధకారమయం చేసుకుంటున్న యువతకు గొల్లపల్లి దివ్య జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.
పేద వ్యవసాయ కుటుంబం..
గొల్లిపెల్లి దివ్య స్వగ్రామం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలకేంద్రం. తల్లిదండ్రులు దేవేంద్ర – సమ్మయ్య. నిరుపేద వ్యవసాయక కుటుంబం. ఆమెకు ఒక చెల్లెలు దీపిక. దివ్య స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదుకుంది. అమ్మానాన్నల కష్టాలు చూసిన దివ్య.. తాను బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలని కలలు కన్నది. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. అనంతరం పోటీ పరీక్షకు వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో దివ్య తలకు బలమైన గాయమైంది. దీంతో ఒక ఏడాదిపాటు చదువుకు దూరంగా ఉండిపోయింది. అయినా పట్టువదలకుండా దివ్య మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే 2018లో తెలంగాణ ప్రభుత్వం పలు ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శిలతోపాటు రైల్వే శాఖలో లోకోపైలెట్గా ఎంపికైంది. ఎంటెక్ సెకండియర్లో పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే ఎస్సైగా ఉద్యోగం సాధించింది. 2020 బ్యాచ్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట మండలం మడికొండ పోలీస్స్టేషన్లో మొదటి పోస్టింగ్లో బాధ్యతలు చేపట్టారు.
అమ్మానాన్నల ప్రోత్సాహం..
యాక్సిడెంట్లో దివ్య తలకు బలమైన గాయమైన సమయంలో.. అయ్యో.. నా బిడ్డ ఎలా ఉంటుందోనని తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. దివ్యకు తల్లి దేవేంద్ర ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. పనులు వదిలేసి, కూతురును కంటికిరెప్పలా కాపాడుకుంది. నిత్యం అందుబాటులో ఉండి దివ్యలో ధైర్యాన్ని నింపింది. అమ్మ చెప్పిన మాటలతో దివ్య మరింత పట్టుదలతో ముందుకు నడిచింది. అమ్మ.. నన్ను ముందుకు నడిపించిన తీరు జీవితంలో మరిచిపోలేను.. అంటూ దివ్య ఆనందభాష్పాలు రాల్చింది. అంతేగాకుండా.. నా స్నేహితురాలు పోలీస్ ఉద్యోగం సాధించింది. అప్పటి నుంచి నేను కూడా పోలీస్ ఉద్యోగం సాధించాలని కలల కన్నాను. పోలీస్ ఉద్యోగం అనగానే నాన్న భయపడ్డారు. వద్దు బిడ్డా.. అంటూ బతిమిలాడారు. కానీ.. అమ్మ మాత్రం నన్ను వెన్నంటి ప్రోత్సహించింది. ఆడపిల్లలు ఎవ్వరికీ తక్కువకాదు.. అంటూ ప్రోత్సహించింది. అమ్మ నమ్మకాన్ని నిలబెట్టాను. అందుకే వీఆర్వో, పంచాయతీకార్యదర్శి, లోకో పైలెట్ ఉద్యోగాలు వచ్చినా.. వదిలేసి ఎస్సై ఉద్యోగంలో చేరాను.. ఎస్సైగా ఉద్యోగం సాధించిన తర్వాత మా గ్రామస్తులు దేవేంద్ర-సమయ్య కూతురు పోలీస్ అయిందంటూ సంబురపడిన క్షణాలను జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేను.. అని దివ్య చెప్పుకొచ్చారు.
అందులో నిజంలేదు…
పోలీస్ డ్యూటీ చాలా కఠినంగా ఉంటుందని అందరూ అంటుండేవారు. కానీ.. అందులో నిజం లేదు. ఇప్పటివరకు డ్యూటీలో నేను ఎలాంటి ఒత్తడిని ఎదుర్కోలేదు. ఇబ్బందులూ కలగలేదు. నా డ్యూటీ నేను సమర్థవంతంగా బాధ్యతగా నిర్వర్తిస్తున్నా. తల్లిదండ్రులపై యువత ఆధారపడకుండా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రతీ చిన్న సమస్యకు కుంగిపోకుండా.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే అవకాశాలు వాటంతట అవే వస్తూనే ఉంటాయి. పోటీ పరీక్షల కోసం.. నిత్యం వార్తాపత్రికలు చదవాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్పై మంచి పట్టుసాధించాలి. గ్రూప్ -1 ఆఫీసర్ ఉద్యోగం సాధించి ప్రజలకు మరింత సేవ చేయాలని అనుకుంటున్నా. తల్లిదండ్రులు యుక్త వయస్సులో ఉన్న పిల్లలను నిశిషితంగా పరిశీలించాలి. పిల్లలతో స్నేహంగా ఉంటూ వారి అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. మంచి మార్గంలో నడిచేలా చూడాలి.