అక్షరశక్తి, హన్మకొండ క్రైం : టెన్త్ హిందీ పేపర్ లీకైన విషయం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనే పేపర్ లీకేజీ జరిగినట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభిం చలేదని అన్నారు. హన్మకొండ జిల్లా కమాలాపూర్ మండలం ఉప్పల్ పరీక్షా కేంద్రం నుంచే లీకేజీ వ్యవహారం జరిగినట్లుగా ప్రచారం జరుగుతోందని, ఆ దిశగా అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇన్విజిలేటర్లే చేసి ఉంటారన్న అనుమానాలను కూడా సీపీ వ్యక్తం చేశారు. ముందుగా గతంలో టీవీ చానెల్లో పనిచేసిన ఓ రిపోర్టర్ నుంచి విద్యాశాఖ అధికారులకు సమాచారం అందినట్లు సీపీ వెల్లడించారు. అతనికి సమాచారం ఏ విధంగా అందిందన్న దానిపై కూడా విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఇతర జిల్లాల్లోనూ పేపర్లు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లోనూ తిరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలోనే వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనే పేపర్ పత్రాలు బయటకు వచ్చినట్లుగా ఆధారాల్లేవని అన్నారు. అయితే ఎస్ఎస్ఎస్సీ అనే గ్రూపులో మొదటగా పరీక్ష పత్రాలు పోస్టులు కనిపించాయన్న చర్చ జరుగుతోంది.
వరంగల్ సీపీకి డీఈవోల ఫిర్యాదు..
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్లో లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆమె ఆరా తీశారు. ప్రశ్నపత్రం లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ జిల్లాల డీఈవోలు మంత్రికి తెలిపారు. పరీక్షలు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. నిజాలు తేల్చేందుకు వరంగల్ సీపీకి ఫిర్యాదు చేయాలని డీఈవోలను మంత్రి సబిత ఆదేశించారు.