- నేడో, రేపో ప్రకటన
- పారదర్శకంగా పరీక్ష విధానం
- తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి పరీక్ష
- భారీగా అభ్యర్థులు పోటీ ఉండే అవకాశం ?
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ -1 నోటిఫికేషన్కు రంగం సిద్ధం అయింది. నేడో , రేపో టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 కు సంబంధించి ఇంటర్వ్యూలను సైతం ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష విధానం మరింత పారదర్శకంగా ఉంటుందని సర్కార్ చెబుతోంది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గ్రూప్ -1 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఈసారి జరిగే గ్రూప్ 1 పరీక్షకు అభ్యర్థులు భారీగా పోటీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఏళ్లుగా లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ 1 కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి వారు ప్రిపరేషన్లో మరింత వేగం పెంచారు. మరికొంత మంది ప్రిపరేషన్ను ప్రారంభించారు.
పకడ్బందీగా పరీక్ష కేంద్రాల ఎంపిక..
ఇటీవలే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అలాంటి అవకాశం లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి గ్రూప్-1 ప్రిలిమ్స్కు సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక అభ్యర్థి 8 -10 వరకు జిల్లాలను ఎంపికచేసుకోవాలి. ప్రియారిటీ ప్రకారం.. మొదటి ఆప్షన్లో సీట్ లేకుంటే రెండో జిల్లాకు.. అక్కడ సీట్ లేకుంటే మూడో జిల్లాను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో ప్రతి అభ్యర్థి 8-10 జిల్లాలను తప్పనిసరిగా ఆప్షన్స్గా ఎంచుకోవాల్సి ఉంటుంది.
మూడు నెలలు ఆదా..
గ్రూప్ – 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియను చేపట్టేవారు. గ్రూప్-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో మొత్తం 675 మార్కులకుగాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది. దీంతో గ్రూప్-1ను 900 మార్కులకు, గ్రూప్-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల మూడు నెలలు ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.